లింగమనేనిని చంద్రబాబు ఆడిస్తున్నారు

25 Sep, 2019 14:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.. లింగమనేని రమేష్‌ను ఆడిస్తున్నారని, బాబు ఆడించినట్టు లింగమనేని ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లింగమనేని కలిసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లింగమనేని రమేష్‌ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి లింగమనేని లేఖ రాయటంపై ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం స్పందించారు. ఈ విషయంపై బుధవారం మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లింగమనేని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే బాబుకు ఇల్లు ఇచ్చారా? లింగమనేనికి అధికారులు నోటీసులు ఇవ్వలేదా? నోటీసులకు లింగమనేని రమేష్‌ ఎందుకు స్పందించలేదు. మీ దగ్గర అనుమతులుంటే పేపర్లు చూపండి. ఇంటి ప్లాన్‌ ఏది, బిల్డింగ్‌ ఫీజు ఎంత కట్టారు? బిల్డింగ్‌ నిర్మాణానికి పైసా ఫీజు కట్టలేదు, అనుమతులు రాలేదు. సర్వేనెంబర్‌ 271,272 ప్రభుత్వ డొంక భూమి అని రికార్డులో ఉంది.

ఆ ప్రాంతంలో అనుమతిచ్చే అధికారం ఉండవల్లి పంచాయితీకి లేదు. ఉడా నుంచి కేవలం స్విమ్మింగ్‌ పూల్‌ కోసమే అనుమతి తీసుకున్నారు. ప్రహారీ గోడకూడా కట్టరాదని నిబంధన ఉంటే లింగమనేని ఏకంగా ఇళ్లే కట్టేశారు.  కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు కట్టడం అవాస్తవమా? తనవెనుక చంద్రబాబు ఉన్నారని లింగమనేని ధీమా. ఇంటి అద్దె పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రభుత్వ సొమ్ము రూ. 1.20 కోట్లు తిన్నారు. మంగళగిరి ఖాజాగ్రామంలో 4,5ఎకరాలు కాజేశార’’ని ఆరోపించారు.

మరిన్ని వార్తలు