మీలా.. హామీలు వదిలేయమంటావా బాబూ..

13 Oct, 2019 17:55 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి

సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనైతికంగా దిగజారి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. ఆయన ఆదివారం తాడేపల్లిలో మీడియా సమావేశంతో మాట్లాడుతూ.. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ఏ నాయకుడైనా ఓటమికి గల తప్పులను అన్వేషిస్తారని.. చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు పోలీసుల అంతుచూస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. పత్రికల్లో రాయలేని భాషను మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని సీఎం జగన్‌పై విమర్శలు చేసేందుకే ఉపయోగిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీలా.. ఇచ్చిన హామీలు వదిలేయమంటావా బాబూ..
నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ సైకోలా కనిపిస్తున్నారా..అంటూ చంద్రబాబుపై పార్థసారధి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేయడం ముఖ్యమంత్రి చేసిన తప్పా అని ప్రశ్నించారు. మీలా..ఇచ్చిన హామీలను గాలికి వదిలేయమంటారా అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వైఎస్‌ జగన్‌ తప్పా అని ప్రశ్నిస్తూ.. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీని లోకేష్‌ భూస్థాపితం చేస్తాడని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ దోపిడీని.. వైఎస్‌ జగన్‌ అరికట్టారనే కారణంతో అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని పత్రికలతో వార్తలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసింది చంద్రబాబేనని పార్థసారధి విమర్శించారు.

మరిన్ని వార్తలు