‘ఇది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు’

23 Dec, 2019 12:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అన్నివర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాసన, పరిపాలన, న్యాయ విభాగ రాజధానులు ప్రజల సెంటిమెంట్‌ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అప్పటీ ఉ‍మ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయినట్లు ఆంధ్రా ప్రజలు నష్టపోకుండా మూడు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

ఇది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేక రాజధానుల విషయంపై రైతులను రెచ్చగోడుతున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు శ్రద్ధ లేదని విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయన అన్న, హీరో చిరంజీవి బాటలో నడుస్తున్నట్లు చెప్పే పవన్‌ రాజధాని విషయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు