రాబర్ట్‌ వాద్రాపై మండిపడ్డ నెటిజన్లు..!

12 May, 2019 21:54 IST|Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా ఓ పొరపాటు కారణంగా నెటిజన్ల ట్రోలింగ్‌కు బలయ్యాడు. ఆదివారం జరిగిన ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో లోధి ఎస్టేట్‌లోని సర్దార్‌పటేల్‌ పాఠశాలలో సతీమణి ప్రియాంకతో కలిసి ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. అయితే, ఓటింగ్‌ అనంతరం.. ‘నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మన హక్కే మన బలం. వయోజనులంతా ఓటు వేయండి. మన ప్రియతమ నేతల్ని గెలిపించుకునేందుకు, మంచి భవిష్యత్‌ కోసం మన మద్దతు అవసరం. లౌకికమైన, సురక్షితమైన, మెరుగైన దేశం కోసం ఓటు వేయండి’ అని చెబుతూ ట్విటర్‌లో ఫింగర్‌ చూపిస్తూ పోస్టు చేశాడు.

అయితే, తన సందేశంలో భారత్‌ జెండా గుర్తు బదులు పరాగ్వే దేశపు జెండా గుర్తును చేర్చాడు. వాద్రా చర్యపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ‘తికమక పడి వాద్రా.. కాంగ్రెస్‌కి బదులు భాజపాకు ఓటు వేసి ఉండొచ్చు’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘ఎట్టకేలకు తాను పరాగ్వే దేశానికి చెందిన పౌరుడినని రాబర్ట్ వాద్రా ఈ రోజు అంగీకరించారు’ అని మరొకరు చురకలంటించారు. పొరపాటును గుర్తించిన వాద్రా.. వెంటనే పరాగ్వే జెండాను తొలగించి, భారత్‌ జెండాను పోస్ట్ చేశారు. అయితే, అప్పటికే నెటిజన్లు స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకున్న ఫొటోలు షేర్‌ చేయడంతో వైరల్‌గా ఈ న్యూస్‌ వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు