అబ్దుల్‌ గఫర్, ప్రతిమ శుభారంభం

25 Oct, 2018 10:18 IST|Sakshi

చార్మినార్‌ ఓపెన్‌ వీల్‌ చెయిర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) వీల్‌ చెయిర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో కర్ణాటక క్రీడాకారులు అబ్దుల్‌ గఫర్, ప్రతిమా రావు శుభారంభం చేశారు. హైదరాబాద్‌ తొలిసారి ఆతిథ్యమిస్తోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ తొలిరౌండ్‌లో విజయం సాధించారు. ఎల్బీ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నీని అగ్రశ్రేణి కథానాయిక అక్కినేని సమంత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. బుధవారం జరిగిన పురుషుల తొలిరౌండ్‌ మ్యాచ్‌లో అబ్దుల్‌ గఫర్‌ 9–2తో దేవేంద్ర (కర్ణాటక)పై గెలుపొందగా... మహిళల విభాగంలో ప్రతిమా రావు 9–0తో సుధ (కర్ణాటక)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో శిల్ప 9–6తో నళిని కుమారిపై, వీరాస్వామి శేఖర్‌ (కర్ణాటక) 9–0తో కుందరాగి బసవరాజు (కర్ణాటక)పై గెలుపొందారు.

ఇతర పురుషుల తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో అంజినప్ప (కర్ణాటక) 9–5తో కేదార్‌ మండల్‌ (ఢిల్లీ)పై, శరవణన్‌ (కర్ణాటక) 9–3తో ఇందుధర బీఎస్‌ (కర్ణాటక)పై, దేవ గౌడ (కర్ణాటక) 7–5తో కేశవన్‌ (కర్ణాటక)పై, మౌలాలి (కర్ణాటక) 9–4తో హనుమంతప్ప (కర్ణాటక)పై నెగ్గారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్‌ ఎండీ ఎ. దినకర్‌బాబు, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్, ఇండియన్‌ వీల్‌చెయిర్‌ టెన్నిస్‌ టూర్‌ (ఐడబ్ల్యూటీటీ) చైర్మన్‌ సునీల్‌ జైన్, భారత టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు