ఆంధ్రకు ఇన్నింగ్స్ ఓటమి

3 Dec, 2015 18:07 IST|Sakshi
ఆంధ్రకు ఇన్నింగ్స్ ఓటమి

ఇండోర్: రంజీ ట్రోఫీలో భాగంగా ఇక్కడ మధ్యప్రదేశ్ తో జరిగిన గ్రూప్ -బి లీగ్ మ్యాచ్ లో ఆంధ్ర ఇన్నింగ్స్ తొమ్మిది పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 159/5 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 78.3 ఓవర్లలో 214 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగులు మాత్రమే చేసి ఫాలో ఆన్ ఆడిన ఆంధ్రను మధ్య ప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ ఏడు వికెట్లతో వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన అంకిత్ అదే ఊపును రెండో ఇన్నింగ్స్ లో కూడా కొనసాగించి ఆంధ్ర పతనాన్ని శాసించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో ప్రశాంత్(49), కెప్టెన్ మహ్మద్ కైఫ్(51), ప్రదీప్(62)లు ఆకట్టుకున్నా జట్టును ఓటమిని తప్పించలేకపోయారు. బుధవారం రెండో రోజు ఆటలోనే ఆంధ్ర పదిహేను వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ తాజా విజయంతో మధ్య ప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 279 ఆలౌట్

ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 56 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 214 ఆలౌట్

>
మరిన్ని వార్తలు