‘ఇక చాలు.. వివాదానికి ముగింపు పలుకుదాం’

3 Apr, 2019 19:00 IST|Sakshi

హార్దిక్‌-రాహుల్‌ వివాదాన్ని తెరదించే దిశగా బీసీసీఐ? 

ముంబై: ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లకు ఊరట కలిగించే వార్త. కీలక ప్రపంచకప్‌కు ముందే ఈ వివాదానికి ముగింపు పలకాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఈ వివాదంపై వ్యక్తిగతంగా హాజరుకావాలని పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్‌9న పాండ్యా, ఆ తర్వాతి రోజు రాహుల్‌లు జైన్‌కు వివరణ ఇవ్వనున్నారు. 
కీలక ఐపీఎల్‌, ప్రపంచకప్‌ దృష్ట్యా ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వారు క్షమాపణలు తెలిపారని, అంతేకాకుండా కొద్ది రోజులు క్రికెట్‌ ఆడకుండా నిషేధానికి గురైన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెడితేనే అందరికీ మంచిదని బోర్డు భావిస్తోంది. 

అసలేం జరిగిందంటే..
‘కాఫీ విత్ కరణ్’ షోకి హాజరైన హార్దిక్, రాహుల్‌.. అమ్మాయిలు, డేటింగ్‌ గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ పాలకుల కమిటీ ఆ ఇద్దరిపై ఈ ఏడాది జనవరిలో కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కానీ.. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కమిటీ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌ని నియమించింది. తాజాగా జైన్‌ సారథ్యంలోని కమిటీ హార్దిక్‌, రాహుల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
(చదవండి: పాండ్యా, రాహుల్‌లకు బీసీసీఐ నోటీసులు)

మరిన్ని వార్తలు