‘మీ టూ’ ఆరోపణల్లో బీసీసీఐ సీఈఓ
న్యూఢిల్లీ: సినీ, పాత్రికేయ రంగాలను కుదిపేసిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)నీ తాకింది. ఏకంగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిపైనే ఆరోపణలు వచ్చాయి. ఆయన 2001 నుంచి 2016 మధ్య డిస్కవరీ చానెల్లో పని చేస్తున్నప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ మాజీ సహోద్యోగిని ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు, స్క్రీన్ షాట్లను జత చేస్తూ ‘రాహుల్ జోహ్రి... నీ సమయం ముగిసింది’ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. దీంతో జోహ్రి వివరణ ఇవ్వాలని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) కోరింది. ఆయన వారం రోజులు గడువు అడిగారని, సమాధానం వచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామని సీఓఏ పేర్కొంది.