కొచ్చి శుభారంభం

3 Feb, 2019 03:40 IST|Sakshi

ప్రొ వాలీబాల్‌ లీగ్‌ 

కొచ్చి: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌ ఘనవిజయంతో శుభారంభం చేసింది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కొచ్చి జట్టు 15–11, 15–13, 15–8, 15–10, 5–15తో యూ ముంబా వాలీ జట్టుపై జయభేరి మోగించింది. మ్యాచ్‌ మొదలైన కాసేపటికే సొంతగడ్డపై కొచ్చి జోరు కూడా మొదలైంది. చూస్తుండగానే వరుస సెట్లతో మ్యాచ్‌ను గెలిచింది. 5–0తో వైట్‌వాష్‌ చేస్తుందనిపించింది. కానీ చివరి సెట్‌ చేజారడంతో 4–1 సెట్లతో గెలిచింది. దీంతో ‘వైట్‌వాష్‌’తో లభించే బోనస్‌ పాయింట్లను కోల్పోయింది. కొచ్చి జట్టులో మను జోసెఫ్‌ (15 పాయింట్లు) చెలరేగాడు.

14 స్పైక్‌ పాయింట్లతో పాటు ఒక బ్లాక్‌ పాయింట్‌ తెచ్చిపెట్టాడు. మిగతావారిలో డేవిడ్‌ లీ (10), రోహిత్‌ (8), ప్రభాకరన్‌ (8), అండ్రెజ్‌ పాటుక్‌ (7) రాణించారు. యూ ముంబా వాలీ జట్టులో నికోలస్‌ డెల్‌ బియాంతో 9 స్పైక్, ఒక బ్లాక్‌ పాయింట్‌తో మొత్తం 10 పాయింట్లు సాధించగా, సహచరుల్లో శుభమ్‌ చౌదరి, ప్రిన్స్‌ చెరో 7 పాయింట్లు చేశారు. అంతకుముందు హడావుడిగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆరు జట్ల కెప్టెన్లతో పాటు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు మైదానంలో మెరిసింది. నేడు (ఆదివారం) ఇక్కడే జరిగే లీగ్‌ మ్యాచ్‌లో కాలికట్‌ హీరోస్‌తో చెన్నై స్పార్టన్స్‌ తలపడుతుంది.  


 

మరిన్ని వార్తలు