బాక్సర్‌ ప్రసాద్‌కు స్వర్ణం 

3 Nov, 2018 02:17 IST|Sakshi

 పుణే: జాతీయ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా (పీఎల్‌) ప్రసాద్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ప్రసాద్‌ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రసాద్‌ 3–2తో అనంత చోపాడే (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. వైజాగ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రసాద్‌ 2015లో 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.

అంతే కాకుండా ప్రపంచ యూత్, ఆసియా యూత్‌ బాక్సింగ్‌ పోటీల్లో భారత్‌కు కాంస్య పతకాలను అందించాడు. ఈసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్‌ తరఫున ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది బాక్సర్లు స్వర్ణాలు గెలవడం విశేషం. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ గెల్చుకున్న సర్వీసెస్‌కు మనీశ్‌ కౌశిక్‌ (60 కేజీలు), మదన్‌లాల్‌ (56 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), దీపక్‌ (49 కేజీలు), దుర్యోధన్‌ సింగ్‌ (69 కేజీలు), మంజీత్‌ సింగ్‌ (75 కేజీలు) కూడా పసిడి పతకాలు అందించారు.    

మరిన్ని వార్తలు