ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

2 Jul, 2018 11:10 IST|Sakshi

దుబాయ్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ద్రవిడ్‌కు స్థానం లభించింది. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ ద‍్రవిడ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించిన విషయాన్ని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక‍్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ స్పష్టం చేశారు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ వికెట్‌ కీపర్‌ క్లెయిర్‌ టేలర్‌లకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు.

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌.  గతంలో బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేలు భారత తరపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించిన ఆటగాళ్లు. ఇక ఆసీస్‌ తరపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 25వ ఆటగాడు పాంటింగ్‌ కాగా, ఈ ఘనత సాధించిన ఏడో మహిళా క్రికెటర్‌ టేలర్‌. ఇంగ్లండ్‌ తరపున మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించారు..

‘క్రికెట్‌ గేమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం కల్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. వరల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి ఇచ్చే గుర్తింపు ఇది. ఈ సందర్భంగా రాహుల్‌ ద‍్రవిడ్‌, రికీ పాంటింగ్‌, టేలర్‌లను అభినందిస్తున్నా’ అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.

‘ ఇదొక గొప్ప గౌరవం. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ తరహా గౌరవం కచ్చితంగా ఏ ఆటగాడి జీవితంలోనైనా రెట్టించిన ఆనందాన్ని తీసుకొస్తుంది’ అని ద‍్రవిడ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు