విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్‌

4 May, 2020 10:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ ఎలిస్‌ పెర్రీతో డిన్నర్‌ చేయాలని ఉందని టీమిండియా క్రికెటర్‌ మురళీ విజయ్‌ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇటీవల విజయ్‌ను సీఎస్‌కే జట్టు ఇంటర్య్వూ చేయగా అక్కడ ఏ ఇద్దరు క్రికెటర్లతో డిన్నర్‌కు వెళ్తారు అనే ప్రశ్న ఎదురైంది.  దీనికి మురళీ విజయ్‌ బదులిస్తూ.. ఎలిస్‌ పెర్రీతో డిన్నర్‌ చేయాలని ఉందన్నాడు. ఆమె చాలా అందంగా  ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. అదే సమయంలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో కూడా డిన్నర్‌ చేయాలని ఉందన్నాడు. ఇక్కడ శిఖర్‌ ధావన్‌ సంగతి ఎలా ఉన్నా ఎలిస్‌ పెర్రీ మాత్రం విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పారు. (చివరి వరకు కేకేఆర్‌తోనే: రసెల్‌)

సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెర్రీకి మురళీ విజయ్‌తో డిన్నర్‌ ప్రశ్న ఎదురు కాగా అందుకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. తనకు విజయ్‌తో డిన్నర్‌కు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే డిన్నర్‌కు అయ్యే బిల్‌ మాత్రం  విజయ్‌ చెల్లిస్తాడని ఆశిస్తున్నా అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇక  వచ్చే వరల్డ్‌కప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా.. లేక యాషెస్‌ సిరీస్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారా’ అనే ప్రశ్నకు కాసేపు ఆలోచించి యాషెస్‌ అని చెప్పారు. కోచ్‌గా చేయడం ఇష్టమా.. కామెంటేటర్‌గా వ్యవహరించడం ఇష్టమా అంటే కోచ్‌గా చేయడానికే ఆమె ఓటేశారు. అదే సమయంలో భారత మహిళా క్రికెట్‌ జట్టు యువ సంచలనం షెఫాలీ వర్మపై పెర్రీ ప్రశంసలు కురిపించారు. షెఫాలీలో టాలెంట్‌ అసాధారణమని కొనియాడారు. ఆ తరహా క్రీడాకారిణిని తమ గేమ్‌లో ఉండాలని కోరుకుంటామన్నారు. (ప్రమాదకరమైన పిచ్‌పై ‘టెస్టు’ ఆడుతున్నాం)

ఇదిలా ఉంచితే,  2018 డిసెంబర్‌లో పెర్త్‌లో ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన విజయ్‌.. ఇప్పటికీ రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించుకోలేపోయాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు తోడు ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా అందుబాటులో ఉండటంతో మురళీ విజయ్‌ను టీమిండియా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్‌ కోసం మాత్రమే క్రికెట్‌ ఆడతానంటూ మనసులో మాట బయటపెట్టాడు. కాగా, గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మురళీ విజయ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు