CWC 2023 Semi Finals: భారత్‌ సెమీస్‌ ప్రత్యర్థి ఎవరో?

9 Nov, 2023 01:18 IST|Sakshi

నాలుగో బెర్త్‌ రేసులో న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ 

ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలి యా జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌ చేరుకున్నాయి. లీగ్‌ దశలో 40 మ్యాచ్‌లు ముగియగా... మరో 5 మ్యాచ్‌ లు మిగిలి ఉన్నాయి. వీటిలో భారత్‌–నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా–బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లకు  ప్రాధాన్యత లేదు. దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లు మాత్రమే రెండు, మూడు స్థానాల్లో ఉంటాయి కాబట్టి ఒక సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి.

‘టాప్‌’ ర్యాంక్‌ను ఖరారు చేసుకున్న భారత్‌ నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో మరో సెమీఫైనల్లో తలపడతుంది. ఒకవేళ పాకిస్తాన్‌ ముందంజ వేస్తే మాత్రం భారత్‌ 16న కోల్‌కతాలో పాక్‌తో రెండో సెమీఫైనల్‌ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌లలో ఒక జట్టు సెమీస్‌కు చేరితే భారత్‌ 15న ముంబైలో తొలి సెమీఫైనల్‌ ఆడుతుంది.
 
ప్రస్తుతం నాలుగో సెమీఫైనల్‌ బెర్త్‌  కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ మధ్య పోటీ ఉంది. మూడు జట్లకు ప్రస్తుతం సమాన పాయింట్లు (8) ఉన్నా... తక్కువ రన్‌రేట్‌తో (–0.338) అఫ్గానిస్తాన్‌ వెనుకబడి ఉంది. రేసులో కనీసం నిలవాలంటే శుక్రవారం తమ ఆఖరి పోరులో ఆ జట్టు భారీ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. దానికి ముందు నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్‌ తలపడుతుంది.

పాకిస్తాన్‌ (0.036)కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉండటం న్యూజిలాండ్‌ (0.398)కు సానుకూలాంశం. లంకపై గెలిస్తే చాలు కివీస్‌ ముందంజ వేసినట్లే. పాక్‌ శనివారం తమ చివరి పోరులో ఇంగ్లండ్‌పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌ బలహీనంగా కనిపిస్తున్నా సరే... ఇది పాక్‌కు అంత సులువు కాదు. అయితే అందరికంటే చివరగా మ్యాచ్‌ ఆడనుండటంతో పాక్‌కు తాము ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉంటుంది. నేడు లంక చేతిలో కివీస్‌ ఓడినా...వర్షంతో మ్యాచ్‌ రద్దయినా రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ఇంగ్లండ్‌పై పాక్‌ గెలిస్తే చాలు సెమీఫైనల్‌ చేరుతుంది. 

మరిన్ని వార్తలు