మళ్లీ మెరిసిన ఫించ్‌.. ఆసీస్‌దే సిరీస్‌

28 Mar, 2019 15:59 IST|Sakshi

అబుదాబి: పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండగానే ఆసీస్‌ కైవసం చేసుకుంది. పాకిస్తాన్‌పై హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ఆసీస్‌ సిరీస్‌ గెలవడంలో కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన ఫించ్‌.. మూడో వన్డేలో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా డకౌట్‌గా పెవిలియన్ చేరినప్పటికీ ఫించ్‌ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాడు. అతనికి జతగా మ్యాక్స్‌వెల్‌(71), పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌(47)లు రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 44.4 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవిచూసింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌(46),ఇమాద్‌ వసీమ్‌(43), ఉమర్‌ అక‍్మల్‌(36), షోయబ్‌ మాలిక్‌(32)లు మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా నాలుగు వికెట్లు సాధించగా, ప్యాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బెహ్రాన్‌డార్ఫ్‌, నాథన్‌ లయన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు. 

మరిన్ని వార్తలు