ధోని ఆర్మీ ట్రైనింగ్‌.. గంభీర్‌ కామెంట్‌

26 Jul, 2019 17:27 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని రెండు నెలల సైనిక శిక్షణపై మాజీ దిగ్గజ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, కపిల్‌ దేవ్‌లు స్పందించారు. ‘ధోని తీసుకున్న నిర్ణయం స్ఫూర్తి దాయకం. ఇప్పటికే అనేకమార్లు ఆర్మీపై తనకున్న అభిమానాన్ని చూశాము. ఇప్పుడు తన నిర్ణయంతో ఆర్మీపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నాడు. ధోని లాంటి దిగ్గజం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది యువత సైన్యంలో పని చేయాలన్న స్ఫూర్తిని కలిగిస్తుంది’అంటూ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నారు. ‘ఆర్మీకి సేవలందించాలనుకున్న ధోని నిర్ణయం అభినందనీయం. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. అత్యంత యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న ధోనిని ఆర్మీ దుస్తుల్లో చూసి యువత సైన్యంలోని పనిచేయాలనే భావన, స్ఫూర్తి కలుగుతుంది’అంటూ కపిల్‌ దేవ్‌ ప్రశంసించాడు.    

కాగా,  టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన రెండు నెలల సైనిక శిక్షణను గురువారం ప్రారంభించాడు. పారాచూట్‌ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోని... బెంగళూరులోని బెటాలియన్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేశాడు. అతడు ఈ నెల 31 నుంచి ఆగస్ట్‌ 15 వరకు బెటాలియన్‌తో ఉంటాడు. విక్టర్‌ ఫోర్స్‌లో భాగంగా దీని యూనిట్‌ కశ్మీర్‌ లోయలో విధులు నిర్వర్తిస్తోంది. సైన్యం ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక ధోని... పహారా, గార్డ్, సెంట్రీ పోస్ట్, దళంలో భాగమవడం తదితర బాధ్యతలు చేపడతాడు.

మరిన్ని వార్తలు