చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

9 Aug, 2019 14:16 IST|Sakshi
గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(పాత చిత్రం)

సాక్షి, అమరావతి : భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ అన్నాడు. ఎంఆర్‌ఎఫ్‌ ఫౌండేషన్‌ ద్వారా క్రీడాకారులకు కోచింగ్‌ ఇవ్వడానికి ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నాడు. క్యాన్సర్‌ వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ కార్యక్రమంలో మెక్‌గ్రాత్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన క్రీడా జీవితానికి సంబంధించిన పలు విషయాలు క్రీడాకారులతో పంచుకున్నాడు. ‘ఆస్ట్రేలియాలో క్రికెట్ జాతీయ క్రీడ. నాకు కుటుంబం నుంచి పూర్తి సహకారం ఉంది. బౌలర్‌గా చాలా సవాళ్లు ఎదుర్కొన్నా. టీ20, వన్డేల మధ్య మానసిక ఒత్తిడిలో తేడా ఉంటుంది. 1997లో మొదటి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు, 2007లో చివరి వన్డే ఆడినప్పుడు నాది ఒకేరకమైన పరిస్ధితి’ అని మెక్‌గ్రాత్‌ చెప్పుకొచ్చాడు. 

అప్పుడు ఫుల్‌టాస్‌లు వేయకూడదు
వర్ధమాన క్రికెటర్లు శిక్షణా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని మెక్‌గ్రాత్‌ సూచించాడు. ‘ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి. చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురి కాకూడదు. అదే విధంగా అప్పుడు ఫుల్‌టాస్‌లు వేయకూడదు. నిజానికి ఫాస్ట్ బౌలర్లకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం. ఏకాగ్రతతతో ఉండి సమయానికి అనుకూలంగా వ్యవహరించాలి. అదే విధంగా క్రీడాకారులందరికీ యోగాతో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈతరం క్రికెటర్స్ మరింత ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతారు’ మెక్‌గ్రాత్‌ యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు.

మరిన్ని వార్తలు