3 ఫైనల్స్‌... 2 ఒలింపిక్‌ బెర్త్‌లు

7 Oct, 2019 04:00 IST|Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన

మారథాన్‌లో గోపీకి 21వ స్థానం

దోహా (ఖతర్‌): వరుసగా ఎనిమిదో ప్రపంచ చాంపియన్‌షిప్‌ నుంచి భారత అథ్లెట్స్‌ రిక్తహస్తాలతో తిరిగి వచ్చారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మనోళ్లు మూడు విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించడం... రెండు విభాగాల్లో టోక్యో ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కించుకోవడం చెప్పుకోతగ్గ విశేషం. పోటీల చివరి రోజు జరిగిన పురుషుల మారథాన్‌ రేసులో ఆసియా చాంపియన్, భారత అథ్లెట్‌ గోపీ థొనకల్‌ 21వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 31 ఏళ్ల గోపీ 2 గంటల 15 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేశాడు. మొత్తం 73 మంది అథ్లెట్స్‌ మారథాన్‌ రేసును ప్రారంభించగా... 18 మంది రేసును పూర్తి చేయలేక మధ్యలో వైదొలిగారు.

లెలీసా దెసీసా (ఇథియోపియా– 2గం:10ని.40 సెకన్లు) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... మోసినెట్‌ జెరెమ్యూ (ఇథియోపియా–2గం:10ని.44 సెకన్లు) రజతం... అమోస్‌ కిప్‌రుటో (కెన్యా–2గం:10.51 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. 2001 తర్వాత మారథాన్‌లో ఇథియోపియా అథ్లెట్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి.  భారత్‌ తరఫున ఈ మెగా ఈవెంట్‌లో 27 మంది పాల్గొన్నారు. 4గీ400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌ సాబ్లే, మహిళల జావెలిన్‌ త్రోలో అన్ను రాణి ఫైనల్‌కు చేరుకున్నారు. అవినాశ్‌తోపాటు 4గీ400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే బృందం టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

మరిన్ని వార్తలు