ఉగ్రదాడి: ధర్మశాలలో పాక్‌ క్రికెటర్ల ఫోటోలు తొలగింపు

20 Feb, 2019 11:37 IST|Sakshi

ధర్మశాల: పుల్వామా ఉగ్ర దాడికి నిరసనగా పాకిస్తాన్‌కు చెందిన 13 మంది క్రికెటర్ల ఫోటోలను హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) తొలగించింది. ధర్మశాలలోని మైదానంలో ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం ఆక్రమ్‌, జావెద్‌ మియాందాద్‌తో సహా మొత్తం పాక్‌ ఆటగాళ్ల ఫోటోలను తొలగించాలని మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. 2005లో టీమిండియా పర్యటన నేపథ్యంలో ధర్మశాలలో బోర్డ్‌ ప్రెసిడెంట్‌ ఎలవన్‌తో పాకిస్తాన్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా షోయబ్‌ అక్తర్‌, షాహిద్‌ ఆఫ్రిది ఆటగాళ్ల ఫోటోలను, ఆ మ్యాచ్‌కు సంబంధించి ఫోటోలను కూడా తొలగించినట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి నిరసనగా, అదే విధంగా భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజింగ్‌ కమిటీ సీనియర్‌ ఒకరు తెలిపారు. (ఉగ్రదాడి.. పాక్‌ క్రికెట్‌కు గట్టిషాక్‌!)

ఇక ఇప్పటికే క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కూడా బ్రాబోర్న్‌ స్టేడియంలో ఉన్న పాక్‌ క్రికెటర్ల ఫోటోలను తీసేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని భారత క్రికెటర్లు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. ప్రపంచకప్‌లో రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్‌ టీమిండియా ఆడరాదంటూ సీనియర్‌ ఆటగాడు హర్బజన్‌ అభిప్రాయపడ్డాడు. ఇక అమరజవాన్ల పిల్లలను తన స్కూల్‌లో ఉచితంగా చదివిస్తానని వీరేంద్ర సెహ్వాగ్‌ ముందుకు రాగా.. మరికొంత మంది ఆటగాళ్లు ఆర్థిక సహాయం అందించారు. బీసీసీఐ కూడా భారీ మొత్తంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. 

మరిన్ని వార్తలు