ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

31 Mar, 2018 12:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ సందడి వారం రోజుల్లో మొదలు కానుంది. ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైళ్లను అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌తో పాటు మే నెలలో కూడా ఈ పొడిగింపు కొనసాగనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మార్గంలో మెట్రో రైళ్లను రాత్రి 10.00 గంటల వరకే నడుపుతున్నారు. గతంలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇపుడు మెట్రో అధికారుల నిర్ణయంతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌​ ఫుల్‌​ ఖుషీ అవుతున్నారు..

అభిమానుల కోసం..
ఐపీఎల్ అభిమానుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పొడిగింపుకు సంబంధించి సీబీటీసీ అనుమతి కోరగా, వారి నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నారు. అమీర్‌పేట నాగోల్ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు... అమీర్‌పేట మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకు రైలు నడుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు