బ్రాత్‌వైట్ సెంచరీ

6 Oct, 2013 01:46 IST|Sakshi
బ్రాత్‌వైట్ సెంచరీ

 షిమోగా: భారత్ ‘ఎ’-వెస్టిండీస్ ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికార టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఎలాగూ ఫలితం డ్రా అని తెలిసిన తర్వాత వెస్టిండీస్ ‘ఎ’ జట్టు ఏ మాత్రం ప్రయోగాలకు పోకుండా మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. ఓపెనర్ బ్రాత్‌వైట్ (247 బంతుల్లో 104; 15 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... దేవ్‌నారాయణ్ (142 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏడు పరుగుల తేడాతో శతకాన్ని కోల్పోయాడు.

 ఈ ఇద్దరి రాణింపుతో నాలుగో రోజు శనివారం వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భార్గవ్ భట్ రెండు వికెట్లు తీసుకోగా... జహీర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 406 పరుగులు చేయగా... భారత్ 359 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల  ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టు 9 నుంచి హుబ్లీలో జరుగుతుంది.
 

>
మరిన్ని వార్తలు