రాణించిన మిథాలీ, స్రవంతి

10 Mar, 2014 01:36 IST|Sakshi
రాణించిన మిథాలీ, స్రవంతి

భారత మహిళల జట్టు గెలుపు
 బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్
 
 కాక్స్ బజార్: టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు తమ సన్నాహాలను ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (64 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు)... బౌలింగ్‌లో స్రవంతి నాయుడు (4/9) రాణించడంతో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో నెగ్గింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.
 
  పూనమ్ రౌత్ (46 బంతుల్లో 42; 2 ఫోర్లు) అండతో రెండో వికెట్‌కు అజేయంగా మిథాలీ 98 పరుగులను జోడించింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా 20 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్రవంతి నాయుడు 3 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా... హైదరాబాద్ బౌలర్ గౌహర్ సుల్తానా (2/11)... బెంగాల్ పేసర్ జులన్ గోస్వామి (2/14) రెండేసి వికెట్లు పడగొట్టారు. స్రవంతి నాయుడుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండో వన్డే ఇదే వేదికపై 11న జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు