ఇంగ్లండ్‌తో వన్డే: సిద్దార్థ్‌ కౌల్‌ అరంగేట్రం

12 Jul, 2018 17:21 IST|Sakshi

గాయం కారణంగా భువీ దూరం

నాటింగ్‌హామ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంలో  భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గాయం కారణంగా భువనేశ్వర్‌ కుమార్‌ దూరం కావడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బౌలర్‌ సిద్దార్థ్‌ కౌల్‌ అరంగేట్రం చేశాడు. టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు.

ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో కోహ్లి ఎక్కువగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా టీ20 జట్టునే కోనసాగించాడు. చివరి టీ20 ఆడని కుల్దీప్‌ యాదవ్‌కు తుదిజట్టులో అవకాశం దక్కింది.  కాగా, గాయం కారణంగా  హేల్స్‌ దూరమవ్వగా బెన్‌ స్టోక్స్‌ తుది జట్టులోకి వచ్చాడు. పిచ్‌ పొడిబారి ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలోనే ఇంగ్లండ్‌ రెండు వరల్డ్‌ రికార్డు స్కోర్‌లు (441, 481) సాధించింది. ఇప్పటికే టి20 సిరీస్‌ గెలుచుకున్న టీమిండియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్‌ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.  


తుది జట్లు:
టీమిండియా: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌

ఇంగ్లండ్‌: ఇయన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, డేవిడ్‌ విల్లే, లియామ్‌ ప్లంకెట్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌
 

మరిన్ని వార్తలు