టీమిండియా ఘనవిజయం

18 Mar, 2015 17:09 IST|Sakshi
టీమిండియా ఘనవిజయం

సిక్సర్ల మోతలు.. ఫోర్ల ఊచకోతలు.. ప్రేక్షకుల కేరింతలు.. ప్రత్యర్థి బౌలర్ల బిత్తర చూపులు.. ఇవీ.. రైనా, ధోనీ బ్యాటింగ్ చేస్తున్నవేళ ఆక్లాండ్ స్టేడియంలో విశేషాలు! వెరసి ప్రపంచ కప్ గ్రూప్ బీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో 8 బంతులు మిగిలుండగానే జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం.

 

104 బంతుల్లో 4 సిక్సర్లు, 9 ఫోర్లు మోదిన  రైనా 110 పరుగులుచేసి నాటౌట్ గా నిలిచాడు. స్లాగ్ ఓవర్లలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డ కెప్టెన్ ధోని.. 76 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ సాయంతో 85 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించినట్లయింది.


కీలక భాగస్వామ్యం


టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(16), శిఖర్ ధావన్(4), విరాట్ కోహ్లీ( 38), అజ్యింకా రహానే(19) పరుగులు చేసి నిష్ర్కమించారు. అప్పటికి టీమిండియా స్కోరు 92 పరుగులు మాత్రమే. దీంతో టీమిండియా విజయంపై ఒకింత అనుమానం చోటు చేసుకుంది. ఆ తరుణంలో సురేష్ రైనా-మహేంద్ర సింగ్ ధోనీలు ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేశారు. వీరిద్దరూ మంచి బంతులను ఆచితూచి ఆడుతూ.. చెత్త బంతులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రైనా సెంచరీ చేయగా, ధోనీ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. చివర వరకూ క్రీజ్ లో ఉన్న రైనా-ధోనీలు 196 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఒత్తిడిలో కూడా టీమిండియా తడబడదని నిరూపించారు.

 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జింబాబ్వే 48.3 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వేకు ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. భారత బౌలర్ల ధాటికి  జింబాబ్వే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్ద జింబాబ్వే ఓపెనర్ మసకద్జ.. భారత పేసర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ చిబాబా.. షమీ బౌలింగ్లో ధావన్కు దొరికిపోయాడు. కాసేపటికి మోహిత్ శర్మ ఓవర్లో మిరె అదే బాటపట్టాడు. దీంతో జింబాబ్వే కష్టాల్లోపడింది. 20 ఓవర్ల వరకు ఆచితూచి ఆడింది. ఆ తర్వాత భారత బౌలర్లు పట్టుసడలించగా.. జింబాబ్వే బ్యాట్స్మెన్ టేలర్, విలియమ్స్ క్రమేణా దూకుడు పెంచారు. టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. టేలర్.. విలియమ్స్తో కలసి నాలుగో వికెట్కు 93 పరుగులు, ఎర్విన్తో ఐదో వికెట్కు 109 పరుగులు జోడించాడు. అశ్విన్.. విలియమ్స్ను, మోహిత్.. టేలర్ను అవుట్ చేశారు. కాగా జట్టు స్కోరు అప్పటికే 250 మార్క్కు చేరువైంది. చివర్లో సికిందర్ రాజా వేగంగా పరుగులు రాబట్టాడు.

మరిన్ని వార్తలు