భారత్‌ ‘డ్రా’తో సరి

15 Nov, 2019 03:13 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌–2022 క్వాలిఫయర్స్‌

దుశంబే (తజికిస్తాన్‌): పేలవమైన ఆటతీరుతో భారత ఫుట్‌బాల్‌ జట్టు మరోసారి ప్రపంచకప్‌–2022 క్వాలిఫయర్స్‌లో గెలుపు బోణీ చేయలేకపోయింది. తన కంటే తక్కువ ర్యాంకు జట్టుతో ఆడుతున్నా... ఓటమి అంచుల వరకు వెళ్లిన భారత్‌ చివర్లో గోల్‌ చేసి ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట ఆరంభం నుంచే అఫ్గాన్‌ జట్టు దూకుడును ప్రదర్శించింది. నజారి (45+1వ ని.) గోల్‌ చేసి అఫ్గాన్‌కు ఆధిక్యాన్నిచ్చాడు. ఆట ఇంజూరి సమయం (90+2వ ని.)లో భారత్‌కు లభించిన కార్నర్‌ను ఫెర్నాండెస్‌ కొట్టగా... ‘డి’ బాక్స్‌లో ఉన్న సెమిలెన్‌ డౌన్‌గెల్‌ హెడర్‌ ద్వారా గోల్‌ పోస్టులోకి నెట్టి స్కోర్‌ను సమం చేశాడు.

మరిన్ని వార్తలు