మొహాలి: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తడబాటును కొనసాగిస్తోంది. భారత స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆటలో 417 పరుగులకు ఆలౌటైన భారత్.. ఆ తరువాత కీలక ఇంగ్లండ్ వికెట్లను సాధించింది. ఈ రోజు ఆటలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కాసేపటికే అలెస్టర్ కుక్(12) మొయిన్ అలీ(5) వికెట్లను నష్టపోయింది. ఇంగ్లండ్ కోల్పోయిన తొలి రెండు వికెట్లను స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా, ఆ తరువాత జో రూట్తో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 31 పరుగులను జత చేసిన తరువాత బెయిర్ స్టో(15)ను జయంత్ యాదవ్ బోల్తా కొట్టించాడు. జయంత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 32 ఓవర్ మూడో బంతికి వికెట్ల మీదుకు దూసుకొచ్చిన బంతిని స్టోక్స్ ఆపే ప్రయత్నం చేశాడు. ఆ బంతి బ్యాట్ అంచున తాకి కీపర్ పార్థీవ్ చేతిలో పడింది. అత్యంత తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్ను పార్థీవ్ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో 70 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ను నష్టపోయింది. కాగా, చివరి సెషన్ ఆఖరి ఓవర్లో బెన్ స్టోక్స్(5)ను అశ్విన్ అవుట్ చేశాడు. దాంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 78 పరుగులతో ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 56 పరుగులు వెనుకబడి ఉంది.