క్వాలిఫయర్‌2: సీఎస్‌కే టార్గెట్‌ 148

10 May, 2019 21:36 IST|Sakshi

విశాఖపట్నం: ఐపీఎల్ సీజన్‌ 12 క్వాలిఫయర్‌ 2లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఢిల్లీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. పృథ్వీ షా(5) తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. అయితే ధావన్‌(18)ను హర్భజన్‌ పెవిలియన్‌కు పంపించాడు. పృథ్వీ షా ఔటైన తర్వాత అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన కోలిన్‌ మున్రో(27) ఢిల్లీ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడగొడుతూనే మరోవైపు పరుగులు రాకుండా సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. 

అయితే ఈ క్రమంలో జట్టును ఆదుకుంటాడని ఆశలు పెట్టుకున్న అయ్యర్‌(13) తాహీర్‌ బౌలింగ్‌లో ఓ చెత్త షాట్‌కు బలయ్యాడు. వికెట్లు పడుతున్నా పంత్‌ క్రీజులో ఉండటంతో ఢిల్లీ జట్టులోనూ, అభిమానుల్లోనూ ఏదో ఆశ కలిగింది. అయితే పంత్‌ను ప్రత్యేకంగా టార్గెట్‌ చేసిన ధోని.. అతడు పరుగులు చేయకుండా కట్టడి చేయించాడు. అయితే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు పెంచే ప్రయత్నం చేశాడు పంత్‌. అదే ఊపులో పంత్‌(38) కూడా నిష్క్రమించాడు. ఇక చివరి ఓవర్‌లో ఇషాంత్‌(10నాటౌట్‌; 1 ఫోర్‌, 1 సిక్సర్‌) ధాటిగా ఆడటంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో హర్భజన్‌, బ్రేవో, దీపక్‌ చాహర్‌, జడేజాలు తలో రెండు వికెట్లు తీశారు.

 
 

మరిన్ని వార్తలు