భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌: ఇంగ్లండ్‌కు షాక్‌?

10 Jun, 2018 18:55 IST|Sakshi
ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌

భారత్‌తో జరగబోయే కీలక టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ కుడి భుజానికి గాయం కారణంగా ఆరు వారాల పాటు ఆటకు దూరం కాబోతున్నాడు. దీంతో ఆగస్టు1న టీమిండియాతో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌కు అండర్సన్‌ అందుబాటులో ఉండేది అనుమానమే. ఇక ఈ స్టార్‌ బౌలర్‌ టెస్ట్‌ సిరీస్‌కు దూరమైతే ఆతిథ్య జట్టు బౌలింగ్‌ మరింత బలహీనపడే అవకాశం ఉంది. కాగా అండర్సన్‌ గాయంపై ఇంగ్లండ్‌ జట్టు ప్రధాన కోచ్‌  ట్రెవర్ బేలిస్ స్పందిస్తూ.. అండర్సన్‌కు అయింది స్వల్ప గాయమే అని, టీమిండియాతో జరగబోయే కీలక టెస్ట్‌ సిరీస్‌కు ముందు ప్రయోగాలు చేయకూడదనే ఉద్దేశంతోనే జిమ్మీకి  విశ్రాంతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఇక ఇంగ్లండ్‌ జట్టు అండర్సన్‌పై అతిగా ఆధారపడుతోందని, అతనిపై బౌలింగ్‌ భారం ఎక్కువగా పడుతోందని సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. గతేడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌లో 223.3 ఓవర్లు బౌలింగ్‌ చేశాడంటే ఇంగ్లండ్‌ జట్టు ఈ స్టార్‌ బౌలర్‌పై ఎంతలా ఆధారపడుతుందో అర్థమవుతోంది. ఇక 2016లోనూ కుడి భుజానికే గాయం కావడంతో భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లకు అండర్సన్‌ దూరమైన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు