ఎంఎస్‌ ధోని తర్వాత దినేశ్‌ కార్తీకే

5 Nov, 2018 15:35 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్‌ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో వికెట్ కీపర్‌గా దినేశ్‌ కార్తీక్‌ నిలిచాడు. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ మూడు క్యాచ్‌లను అందుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో ఎంఎస్‌ ధోని తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌ కీపర్‌గా దినేశ్‌ గుర్తింపు సాధించాడు.

రామ్‌దిన్‌, హెట్‌మైర్‌, రోవ్‌మాన్‌ పావెల్‌ క్యాచ్‌లను దినేశ్‌ కార్తీక్‌ పట్టాడు. దాంతో శ్రీలంక మాజీ వికెట్‌ కీపర్‌ సంగక్కార(142) రికార్డును దినేశ్‌ కార్తీక్‌ బ్రేక్‌ చేశాడు. ప్రస్తుతం దినేశ్‌ కార్తీక్‌ 143 క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఎంఎస్‌ ధోని 151 క్యాచ్‌లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కమ్రాన్‌ అక్మల్‌(123), దినేశ్‌ రామ్‌దిన్‌(120)వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.విండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌(31 నాటౌట్‌; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌),  కృనాల్‌ పాండ్యా(21 నాటౌట్‌;9 బంతుల్లో 3 ఫోర్లు)లు విజయంలో ముఖ్యభూమిక పోషించారు.

మరిన్ని వార్తలు