ధోని ఆలోచనల్ని అర్ధం చేసుకోవాలి: జాదవ్‌

19 Jan, 2019 14:01 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం సత్తా చాటింది. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (87నాటౌట్‌)తో పాటు చివరివరకు అజేయంగా నిలిచిన కేదార్‌ జాదవ్‌ ( 61 నాటౌట్‌) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంస్‌ ధోనితో పాటు క్రీజులో ఉండడం చాలా సంతోషాన్నిచ్చిందని  చహల్‌ టీవీకి ఇచ్చిన ఎక్సుక్లూజివ్‌ చాట్‌లో జాదవ్‌ చెప్పుకొచ్చాడు. (మళ్లీ రిటైరవుతున్నా అంటారేమో: ధోని)

ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌, ఆ వెంటనే వన్డే సిరీస్‌ గెలుపొందడం చాలా ఆనందంగా ఉందన్నాడు జాదవ్‌. వన్డే ప్రపంచకప్‌ టోర్నీ మరికొద్ది రోజుల్లోనే ఉన్నందున ఈ విజయం జట్టు సభ్యులకు జోష్‌నిస్తుందని వ్యాఖ్యానించాడు. విన్నింగ్‌ జట్టులో సభ్యుడినైనందుకు మరింత ఉత్సాహనిచ్చిందన్నాడు.  టీమిండియా విజయంలో జట్టు సభ్యులందరూ వారి శక్తిమేరకు కృషి చేశారని ప్రశంసించాడు. (ఆసీస్‌ గడ్డపై కోహ్లిసేన డబుల్‌ ధమాకా!)

‘ఆస్ట్రేలియాలో ఇదే నా తొలి మ్యాచ్‌. మరొకవైపు సిరీస్‌లో చివరి మ్యాచ్‌ కావడంతో క్రీజులో ఎక్కువసేపు ఉండేందుకు నిశ్చయించుకున్నాను. స్ట్రయిక్‌ మెయింటేన్‌ చేస్తూ చివరివరకూ క్రీజులో ఉంటే టార్గెట్‌ చేరుకుంటామని అనుకున్నాను. మరో ఎండ్‌లో  ధోని ఉండడంతో నా ఆలోచనలకు బలం చేకూరింది. బ్యాటింగ్‌ చేసే క్రమంలో నా సందేహాలను ధోని వద్ద నివృత్తి చేసుకునేవాడిని. ధోని మరో ఎండ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌ చేయడం ఈజీగా అనిపిస్తుంది. క్రీజులో ధోని ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న బౌలర్‌ అంచనాలతో పాటు మిస్టర్‌ కూల్‌ ఆలోచనలను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అతను క్రీజులో ఉంటే కొండంత బలం. ’ అని ధోని పై ఉన్న అభిమానాన్ని వెల్లడించాడు కేదార్‌.

మరిన్ని వార్తలు