లియాండర్‌ పేస్‌పై వేటు

29 Aug, 2018 01:28 IST|Sakshi

సెర్బియాతో డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌కు భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ను సెర్బియాతో జరిగే డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేయలేదు. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు సెర్బియాలో ఈ పోటీ జరుగుతుంది. గత ఏప్రిల్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో నెగ్గి డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక డబుల్స్‌ విజయాలు (43) సాధించిన ప్లేయర్‌గా లియాండర్‌ పేస్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సెర్బియాతో మ్యాచ్‌ కోసం రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్, యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల భారత జట్టును ఎస్‌పీ మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన జంట బోపన్న–దివిజ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ ఆడుతుంది. యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్, ప్రజ్నేశ్‌ సింగిల్స్‌లో పోటీపడతారు. మహేశ్‌ భూపతి నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌గా, జీషాన్‌ అలీ కోచ్‌గా వ్యవహరిస్తారు.    
 

మరిన్ని వార్తలు