కేకేఆర్‌ ట్వీట్‌పై మనోజ్‌ ఆగ్రహం

28 May, 2020 14:37 IST|Sakshi

కోల్‌కతా: ఎనిమిదేళ్ల క్రితానికి సంబంధించిన మధుర స్మృతులను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) చేసిన ట్వీట్‌ వివాదస్పదమైంది. ఐపీఎల్‌-12 ట్రోఫీని కేకేఆర్‌ ముద్దాడి నిన్నటికి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి నైట్‌రైడర్స్‌ మనసును తాకిన రాత్రి. తొలిసారి అందుకున్న ట్రోఫీ ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరి మీ జ్ఞాపకాలేంటి?’ అని ప్రశ్నిస్తూ మాజీ సారథి గౌతమ్‌ గంభీర్‌, బ్రెండన్‌ మెకల్లమ్‌, సునీల్‌ నరైన్‌, బ్రెట్‌లీలను కేకేఆర్‌ ట్యాగ్‌ చేసింది. 

ఈ ట్వీట్‌పై కేకేఆర్‌కు చెందిన అప్పటి ఆటగాడు మనోజ్‌‌ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అందరితో పాటు.. ఆ రోజుతో నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఈ ట్వీట్‌లో నన్ను, షకీబుల్‌హసన్‌ను ట్యాగ్‌ చేయకపోవడం మమల్ని అవమానించినట్టే. మా పేర్లను మరిచిపోవడం నాకు బాధను కలిగించింది’ అంటూ మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశాడు. ఇక దీనిపై స్పందించిన కేకేఆర్‌ ‘అలా కాదు మనోజ్‌.. నీలాంటి స్పెషలిస్టు ప్లేయర్‌ను మేమెలా మర్చిపోతాం. ఐపీఎల్‌-2012 ట్రోఫీని కేకేఆర్‌ గెలుచుకోవడంలో నువ్‌ కీలక పాత్ర పోషించావు, నువ్వే మా హీరోవి’ అంటూ బదులిచ్చింది. (మురళీ విజయ్‌ హీరో అయిన వేళ!)

ఇక ఐపీఎల్‌-2012లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో కేకేఆర్‌ ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని తొలిసారి ట్రోఫీని అందుకుంది. నాటి ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో మనోజ్‌ 15 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులతో రాణించాడు.  ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగిన వేలంలో మనోజ్ తివారీ ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చినా ఎవరూ ఆసక్తికనబర్చకపోవడం గమనార్హం. (ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్‌.. డిలీట్‌)

మరిన్ని వార్తలు