ఏడేళ్ల తర్వాత టీమిండియా..

16 Jul, 2018 13:44 IST|Sakshi

లార్డ్స్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 86 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే రెండో వన్డేలో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌  తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. టాస్‌ ఓడిన భారత్‌ మొదట బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేజ్‌ చేయలేక ఓటమి పాలైంది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ తక్కువ పరుగులకే ఔటవ్వడం.. ఆ తర్వాత కోహ్లి, సురేశ్‌ రైనా ఇన్నింగ్స్‌ చక్కదిద్దేలోపే పెవిలియన్‌ బాట పట్టడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరపున 16 ఫోర్లు నమోదయ్యాయి. కాగా, రెండో వన్డేలో భారత్‌ ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఇలా భారత జట్టు తన ఇన్నింగ్స్‌లో కనీసం సిక్సర్లు లేకుండా ముగించడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

2011లో ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడిన భారత్‌ అప్పుడూ ఒక్క సిక్స్‌ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టు సిక్స్‌ను సాధించలేకపోయింది. అయితే ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించి ఫైనల్‌కు చేరగా, ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో మాత్రం పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌ నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ మంగళవారం జరగనుంది.

మరిన్ని వార్తలు