లండన్ : 2009 ఐపీఎల్ వేలం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంచైజీ రూ. 9.8 కోట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే పెద్ద మొత్తంలో పీటర్సన్ అమ్ముడు పోవడంపై పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు అసూయ చెందారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పేర్కొన్నాడు . స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్ మాట్లాడుతూ... 'నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఆ ఆటగాళ్లు ఒప్పుకోరు.. కానీ.. పీటర్సన్కు భారీ ధర దక్కినప్పుడు మాత్రం అసూయ చెందారనే పుకార్లు వినిపించాయి. గ్రేమ్ స్వాన్, టిమ్ బ్రెస్నన్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ , మాట్ ప్రియర్ లాంటి ఆటగాళ్లకు తక్కువ మొత్తంలోనే వేలంలో అమ్ముడుపోయారు. (టేబుల్ టెన్నిస్ ఇలా కూడా ఆడొచ్చా!)
ఐపీఎల్లో ఆడటం వల్ల కెరీర్ చాలా స్పీడ్గా ఉంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.అయితే అతను డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతున్నట్లు ఇంగ్లండ్ ఆటగాళ్ళు భావించేవారు. ఐపీఎల్ ఆడితే ఆటను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని పీటర్సన్ చెప్పినా ఎవరూ వినలేదంటూ' మైకేల్ వాన్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు . 104 టెస్టుల్లో 8,181 పరుగులు, 136 వన్డేల్లో 4,440 పరుగులు, 37 టీ20ల్లో 1176 పరుగులు చేశాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాకా పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
(వైరల్ : నీ ఏకాగ్రతను మెచ్చుకోవాల్సిందే)