CWC 2023: దిగ్గజాలు కలిసిన వేళ.. సచిన్‌, విరాట్‌లతో ముచ్చటించిన డేవిడ్‌ బెక్‌హమ్‌

16 Nov, 2023 12:34 IST|Sakshi

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో ఫుట్‌బాల్‌ దిగ్గజం డేవిడ్‌ బెక్‌హమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బెక్‌హమ్‌ యూనిసెఫ్‌ ప్రతినిధి హోదాలో ఇండియాలో పర్యటిస్తున్నాడు. షెడ్యూల్‌లో భాగంగా అతను వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా బెక్‌హమ్‌.. క్రికెట్‌ గాడ్‌, యూనిసెఫ్‌ ప్రతినిథి అయిన సచిన్‌ టెండూల్కర్‌ను కలిసాడు.

వీరిద్దరు చాలా సేపు ముచ్చటించారు. సచిన్‌ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని కావడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరింది. సచిన్‌, బెక్‌హమ్‌లు క్రికెట్‌, ఫుట్‌బాల్‌కు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకున్నారు. సచిన్‌ బెక్‌హమ్‌ను ముంబై ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాంఖడే స్టేడియం​ మొత్తం తిప్పాడు. యూనిసెఫ్‌ ప్రతినిధి హోదాలో బెక్‌హమ్‌కు ఐసీసీ గౌరవ వందనం తెలుపుతూ మ్యాచ్‌కు ముందు మైదానంలోకి ఆహ్వానించింది.

అనంతరం టీమిండియా, కివీస్‌ క్రికెటర్లంతా బెక్‌హమ్‌ను పరిచయం చేసుకున్నారు. బెక్‌హమ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లితో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ దాన్ని రీట్వీట్‌ చేశాడు. ఈ వీడియో నిన్నటి నుంచి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. కాగా, బెక్‌హమ్‌ ప్రస్తుతం ఇంటర్‌ మయామీ అనే ఫుట్‌బాల్‌ క్లబ్‌కు‌ కో ఓనర్‌గా ఉన్నాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌, అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్‌కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్‌ షమీ (9.5-0-57-7) సూపర్‌ బౌలింగ్‌తో మెరవడంతో భారత్‌ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. 

మరిన్ని వార్తలు