టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంతంగా కూర్చుని తుపాకీతో కొన్ని రౌండ్లు గురి తప్పకుండా టార్గెట్ను షూట్ చేశాడు ధోని. అయితే ప్రకటనల కోసం చేసే షూటింగ్ కంటే కూడా తుపాకీతో కాల్చడం చాలా తేలికంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తాజాగా ఓ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ట్రైనింగ్ తీసుకున్న షూటర్, పోలీసుల తరహాలో ధోని తన టార్గెట్లను సరిగ్గా షూట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఆ వీడియోకు అనూహ్య స్పందన వస్తోంది. ధోని గురి తప్పలేదంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 11 సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ధోనీసేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని కూల్ కూల్గా గన్ ఫైర్ చేస్తున్నాడని మరికొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఈ ఏప్రిల్ 2వ తేదీన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్కు ఆర్మీ దుస్తుల్లోనే వెళ్లిన ధోని కవాతు చేస్తూ వెళ్లి మరీ రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.