అదే ధోనికి చివరి చాన్స్‌ కావొచ్చు..

28 Mar, 2020 11:57 IST|Sakshi

న్యూఢిల్లీ:  మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని భారత జట్టులోకి రావడం ఇక కష్టమేనని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడగా, అతని చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ రంజాన్‌ బెనర్జీ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టులో  ధోని తిరిగి చోటు దక్కించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని, కానీ చివరగా ఒక్క చాన్స్‌ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. ఐపీఎల్‌తో తిరిగి సత్తా చాటుకుని జట్టులోకి రావాలని చూసిన ధోనికి నిరాశే ఎదురైంది. ఐపీఎల్‌ కోసం ముందుగానే ప్రాక్టీస్‌ మొదలు పెట్టేసినా ఆ లీగ్‌ వాయిదా పడటంతో ధోని ఆశలు తీరేలా కనబడుటం లేదు. 

అసలు ఐపీఎల్‌ జరుగుతుందనే విషయంపై కూడా క్లారిటీ లేదు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్‌ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపైనే ధోని చిన్ననాటి కోచ్‌ రంజాన్‌ బెనర్జీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌తో భారత జట్టులో తిరిగి రావాలని ధోని చూశాడని,  ఇప్పుడు ఆ లీగ్‌ జరిగే అవకాశాలు లేకపోవడంతో జాతీయ జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. కాకపోతే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)..ధోనికి చివరగా ఒక అవకాశం ఇచ్చి చూస్తుందన్నాడు. అది కూడా టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చివరి అవకాశం లభిస్తుందన్నాడు.

మరిన్ని వార్తలు