ముగిసిన హాకీ జాతీయ శిబిరం

22 Jan, 2018 10:55 IST|Sakshi

రాయదుర్గం: జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌ సన్నాహకంగా ఏర్పాటు చేసిన సీనియర్‌ మహిళల హాకీ శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. తెలంగాణ హాకీ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 13 నుంచి ఈ శిబిరం జరిగింది. క్యాంప్‌ ముగింపు కార్యక్రమంలో ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. వారికి స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రతీ జిల్లాకు ఒక హాకీ కోచ్‌ను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. అర్జున అవార్డు గ్రహీత, ఒలింపియన్‌ ముకేశ్‌ కుమార్‌ను హాకీ క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ హాకీ సంఘం చేస్తోన్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో హాకీ సంఘం అధ్యక్షులు సరళ్‌ తల్వార్, ఒలింపియన్‌ ముకేశ్‌ కుమార్, రంగారెడ్డి జిల్లా హాకీ అధ్యక్షులు విజయ్‌ కుమార్, కార్యదర్శి భాస్కర్‌ రెడ్డి, కోచ్‌ సుఖేందర్‌ సింగ్‌ పాల్గొన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. రాష్ట్ర మహిళల హాకీ జట్టు డి. గీత (కెప్టెన్‌), ఎం. రేఖ (వైస్‌ కెప్టెన్‌), ఆర్‌. మౌనిక, ఎం. రుచిక, ఎం. మాళవిక, జె. కవిత, పి. సాగరిక, ఎం. సరోజ, మీనాక్షి, శ్రుతి కౌశిక్, డి. వైష్ణవి, టి. ప్రియాంక, కె. హారిక, కె. సుప్రియ, ఆర్‌. ప్రియాంక, ఎం. మౌనిక, సుమన్‌ కుమారి, అఫ్సాన్‌ సుల్తానా.

మరిన్ని వార్తలు