‘వివాహితుడితో ఏ మహిళైనా హోటల్‌కు వెళ్తుందా’

19 Mar, 2018 19:45 IST|Sakshi
భర్త షమీతో హసిన్‌ జహాన్‌ (ఫైల్‌ ఫొటో)

నా జీవితాన్ని నాశనం చేసేందుకు పాక్‌ యువతి అలా చేసింది

క్రికెటర్‌ షమీ భార్య హసిన్‌ ఆరోపణ

కోల్‌కతా: భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ సోమవారం అలిపోర్‌ కోర్టు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తన భర్త షమీపై వివాహేతర సంబంధాల కేసులో హసిన్‌ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు సంబంధించిన వాంగ్మూలాన్ని ఆమె కోర్టులో ఇచ్చారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె నేరుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. కాళీఘాట్‌లోని సీఎం నివాసానికి వెళ్లి.. మమతను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అభ్యర్థనను అధికారులకు అందజేశారు. భర్తకు వ్యతిరేకంగా తాను జరుపుతున్న పోరాటానికి సీఎం మమత మద్దతుగా నిలువాలని ఆమె కోరారు.

తన భర్తకు చాలా వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను చంపాడానికి కూడా షమీ ప్రయత్నించాడని ఆమె మీడియాతో అన్నారు. పాకిస్థానీ యువతి అలీషబాతో తన షమీకి వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ‘అలీషబా షమీ స్నేహితురాలు కాదు. అభిమానీ కాదు. ఏ మహిళ అయినా వివాహమైన వ్యక్తితో హోటల్‌లో గడుపుతుందా? అతని గదికి వెళ్లి.. అతని పడకగదిని పంచుకుంటుందా? నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఆమె హోటల్‌కు వచ్చింది’ అని హసిన్‌ మీడియాతో తెలిపింది. మరోవైపు పాక్‌ యువతి అలీషబా మాట్లాడుతూ.. షమీ ఒక క్రికెటర్‌గా తనకు తెలుసునని, ఒక అభిమానిగా ఆయనను కలిసేందుకు మాత్రమే హోటల్‌కు వెళ్లానని వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు