ప్రణవ్‌ రామ్‌కు సింగిల్స్‌ టైటిల్‌

15 Jul, 2019 10:13 IST|Sakshi

ఆలిండియా ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సబ్‌ జూనియర్‌ (అండర్‌–13) ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు ఎన్‌. ప్రణవ్‌ రామ్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో ప్రణవ్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌తో పాటు... డబుల్స్‌తో తన భాగస్వామి రామ్‌ ప్రసాద్‌తో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ప్రణవ్‌ 21–11, 20–22, 21–19తో అంకరన్‌ శర్మ (హరియాణా)పై గెలుపొందాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి నవ్యకు నిరాశ ఎదురైంది.

ఫైనల్లో టాప్‌సీడ్‌ నవ్య 19–21, 19–21తో రెండో సీడ్‌ ఉన్నతి హుడా (హరియాణా) చేతిలో కంగుతింది. బాలుర డబుల్స్‌ విభాగంలో టాప్‌సీడ్‌ ప్రణవ్‌ రామ్‌–సాయిప్రసాద్‌ (తెలంగాణ) ద్వయం 13–21, 21–12, 12–21తో అహంథమ్‌ కాస్పరోవ్‌–బోరిశ్‌ సలామ్‌ (మణిపూర్‌) చేతిలో ఓడిపోయి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బాలికల డబుల్స్‌ టైటిల్‌ పోరులో నవ్య (ఆంధ్రప్రదేశ్‌)–శ్రీవన్షి (తెలంగాణ) జంట 15–21, 21–10, 21–16తో టాప్‌సీడ్‌ ఉన్నతి (హరియాణా)–దివిత (ఆంధ్రప్రదేశ్‌) జోడీకి షాకిచ్చింది.

మరిన్ని వార్తలు