పృథ్వీలో ఆ ముగ్గురు: రవిశాస్త్రి

15 Oct, 2018 05:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓపెనింగ్‌ సంచలనం పృథ్వీ షాలో దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ సచిన్, సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారని భారత కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. ‘పృథ్వీ క్రికెట్‌ ఆడేందుకే పుట్టినట్లున్నాడు. ముంబైలోని మైదానాల్లో ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాడు. అతనిలో కష్టపడాలన్న తపన కనిపిస్తోంది. అతను ఆడే షాట్లలో సచిన్‌... ఒక్కోసారి సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారు. కెరీర్‌ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుండా ఇలాగే కష్టపడితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టెస్టుల్లో 10 వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజాలైన కపిల్‌ దేవ్, శ్రీనాథ్‌ల సరసన నిలిచిన ఉమేశ్‌ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.

‘జట్టుకు తాను విలువైన బౌలర్‌నని ఉమేశ్‌ తాజా ప్రదర్శనతో చాటుకున్నాడు. ఓపెనర్‌ రాహుల్‌ టచ్‌లోకి వచ్చాడు. అతను ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు బాగా కష్టపడతాడు. ఈ మ్యాచ్‌లో నాకదే కనిపించింది. ఈ వరుసలో తాజాగా రిషభ్‌ పంత్‌ వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు’ అని రవిశాస్త్రి అన్నాడు. వృద్ధిమాన్‌ సాహాకు పంత్‌ నుంచి ఏర్పడిన పోటీపై స్పందిస్తూ... ఇవన్నీ సాను కూలాంశాలన్నాడు. ఒకరు లేకపోతే ఇంకొకరు సత్తా చాటుతున్నారని చెప్పాడు. శార్దుల్‌ ఓ సెషన్‌లో దూరమైతే ఉమేశ్‌ ఆ స్థానాన్నీ భర్తీ చేశాడని, పది వికెట్లు తీయగలిగాడని దీంతో జట్టు ఏ ఒక్కరిమీద ఆధారపడలేదనే విషయం స్పష్టమవుతుందని కోచ్‌ వివరించాడు.  

మరిన్ని వార్తలు