కేకేఆర్‌ లక్ష్యం 177

8 Apr, 2018 21:44 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌ చేపట్టింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను బ్రెండన్‌ మెకల్లమ్‌, డీ కాక్‌లు ఆరంభించారు. డీకాక్‌(4) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, మెకల్లమ్‌ మాత్రం విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు సాధించి రెండో వికెట్‌గా అవుటయ్యాడు.

అటు తర్వాత విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన పిదప డివిలియర్స్‌ ఔటయ్యాడు. దాంతో జట్టు స్కోరు 127 పరుగుల వద్ద బెంగళూరు మూడో వికెట్‌ను కోల్పోయింది. భారీ షాట్‌కు యత్నించిన డివిలియర్స్‌(44;23 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆపై మరుసటి బంతికే కోహ్లి(31; 33 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) బౌల‍్డ్‌ అయ్యాడు. ఈ రెండు వికెట్లను నితీష్‌ రానా తన ఖాతాలో వేసుకుని కేకేఆర్‌లో జోష్‌ను నింపాడు. చివర్లో మన్‌దీప్‌ సింగ్ ‌(37; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నితీష్‌ రానా, వినయ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు సాధించగా, పియూష్‌ చావ్లా, సునీల్‌ నరైన్‌, మిచెల్‌ జాన్సన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు