‘అతన్ని తీసుకోకుండా భారత్‌ ఘోర తప్పిదం చేసింది’

23 Apr, 2019 13:27 IST|Sakshi
రికీ పాంటింగ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌

జైపూర్‌ : ప్రపంచకప్‌కు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేయకపోవడం భారత్‌ చేసిన ఘోర తప్పిదమని ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. సోమవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ (36 బంతుల్లో 78 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్‌ స్మిత్‌ (32 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్‌ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ దాటిగా ఆరంభించగా.. రిషభ్‌ పంత్‌ మెరుపులతో కొండంత లక్ష్యం చిన్నబోయింది.

పంత్‌ ఇన్నింగ్స్‌కు ముగ్దుడైన రికీ పాంటింగ్‌.. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ప్రశంసల జల్లు కురపించాడు. ‘ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కనందుకు పంత్‌ ఎలా బాధపడ్డాడో నాకు తెలుసు. నా అభిప్రాయం ప్రకారం పంత్‌ను తీసుకోకుండా భారత్‌ ఘోర తప్పిదం చేసింది. పంత్‌ ఇంగ్లీష్‌ కండిషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకునేవాడు. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్నర్లను ఓ ఆట ఆడుకునేవాడు. అతన్ని ఎంపిక చేయనప్పుడే చెప్పా.. పంత్‌కు మూడు నాలుగు ప్రపంచకప్‌లు ఆడే సత్తా ఉందని, మళ్లీ చెబుతున్నా.. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటే పంత్‌కు ఆట విషయంలో తిరుగులేదు.’ అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. ఇక పేస్‌తో కూడిన పిచ్‌లపై పంత్‌ చెలరేగుతాడని, ఇదే తరహా పిచ్‌ అయిన ముంబైలో కూడా 20 బంతుల్లో 70 పరుగులు చేశాడని పాంటింగ్‌ గుర్తు చేశాడు. ఢిల్లీ జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని పాంటింగ్‌ కొనియాడాడు.

మరిన్ని వార్తలు