సారావక్ (మలేసియా): కొత్త ఏడాదిని టైటిల్తో ఆరంభించింది భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్. ఆదివారం జరిగిన మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 22-20, 22-20 తేడాతో థాయ్లాండ్కు చెందిన పోర్న్పవీ చోచువోంగ్ పై విజయం సాధించి టైటిల్ ను సొంతం చేసుకుంది. గతేడాది రియో ఒలింపిక్స్ తరువాత గాయం కారణంగా పలు టోర్నీలకు దూరమైన సైనా.. ఎట్టకేలకు తన పూర్వపు ఫామ్ ను అందుకుంటూ టైటిల్ను కైవసం చేసుకుంది. 46 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సైనా తన అనుభవాన్ని ఉపయోగించి టైటిల్ ను సాధించింది.
ఈ మ్యాచ్లో సైనా ఆదిలో వెనుకబడినప్పటికీ చివరకంటూ పోరాడి టైటిల్ ను గెలుచుకోవడం విశేషం. ప్రధానంగా తొలి గేమ్లో టాప్ సీడ్ సైనా 0-4తో వెనుకంజ వేసింది. ఆ తరువాత థాయ్ లాండ్ క్రీడాకారిణి అదే ఊపును కొనసాగించడంతో సైనా 5-11తో మరింత వెనుకబడింది. ఆ సమయంలో తేరుకున్న సైనా 10-13 తేడాతో పోర్న్పవీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తరువాత ఇరువురు 19-19 తో సమంగా ఉన్న దశలో సైనా గేమ్ పాయింట్ ను కాపాడుకోవడంతో పాటు వరుసగా రెండు పాయింట్లను సాధించి తొలి గేమ్ను దక్కించుకుంది.
ఇక రెండో గేమ్ చివర్లో ఇరువురి క్రీడాకారిణుల మధ్య అసలు సిసలైన పోరాటానికి తెరలేచింది. సైనా 16-17తో వెనుబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి విజయానికి చేరువగా వెళ్లింది. ఆ తరుణంలో పోర్న్పవీ విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లను సాధించి స్కోరును సమం చేసింది. ఆఖర్లో సైనా వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్ ను సొంతం చేసుకుంది. తద్వారా తొలిసారి మలేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి టైటిల్ ను సైనా సాధించినట్లయ్యింది. 2011లో జరిగిన ఈ టోర్నీలో సైనా ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లి రన్నరప్గా సరిపెట్టుకుంది. ఇది సైనా కెరీర్లో 23వ ఓవరాల్ టైటిల్ కాగా, గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ తరువాత తొలి టైటిల్.