సైనా, సింధు శుభారంభం

16 Jan, 2014 01:22 IST|Sakshi
సైనా, సింధు శుభారంభం

కౌలాలంపూర్: మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధు శుభారంభం చేశారు. ఎనిమిదో సీడ్ సైనా బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో 21-10, 21-16తో ఇండోనేసియాకు చెందిన హిరా దేసిని 36 నిమిషాల్లో ఓడించింది. మరో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-17, 21-18తో  ఫానెత్రి (ఇండోనేసియా)పై చెమటోడ్చి నెగ్గింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో రౌండ్లో సైనా... జుయ్ యావో (చైనా)తో, సింధు... ఆరో సీడ్ జు బే (దక్షిణ కొరియా)తో తలపడతారు.
 
 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్, శ్రీకాంత్ శుభారంభం చేశారు. పారుపల్లి కశ్యప్ 21-19, 21-13తో జర్మనీకి చెందిన మార్క్ జ్విబ్లెర్‌పై గెలుపొందగా, శ్రీకాంత్ 21-17, 18-21, 21-16తో హూ యున్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచాడు. గురుసాయిదత్ 18-21, 21-11, 21-23తో ఎరిక్ పాంగ్ (నెదర్లాండ్స్) చేతిలో పోరాడి ఓడగా... ఆనంద్ పవార్ 12-21, 11-21తో జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) ధాటికి చేతులెత్తేశాడు.
 

మరిన్ని వార్తలు