సైనా, శ్రీకాంత్‌ గెలుపు

6 Jan, 2017 00:02 IST|Sakshi
సైనా, శ్రీకాంత్‌ గెలుపు

అవధ్‌ చేతిలో ఢిల్లీ ‘మైనస్‌’ ఓటమి ∙పీబీఎల్‌–2

లక్నో: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో అవధ్‌ వారియర్స్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో వారియర్స్‌ 6–(–1)తో ఢిల్లీ ఏసర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అవధ్‌ తరఫున సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు అదరగొట్టారు. పురుషుల డబుల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విషెమ్‌ గో–మార్కిస్‌ కిడో (అవధ్‌) జోడి 11–4, 11–4తో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–అక్షయ్‌ దివాల్కర్‌ (ఢిల్లీ) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌ను అవధ్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్‌ (అవధ్‌) 14–12, 11–7తో నిచావోన్‌ జిందాపొల్‌ (ఢిల్లీ)పై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సైనా జోరు పెంచింది. దీంతో ప్రత్యర్థి జిందాపొల్‌ ఏ దశలోనూ ఆమెకు పోటీనివ్వలేకపోయింది. ట్రంప్‌ విజయంతో బోనస్‌ పాయింట్‌ సాధించిన వారియర్స్‌ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

అనంతరం పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (అవధ్‌) 11–9, 11–13, 11–9తో జానొ జోర్గెన్సెన్‌ (ఢిల్లీ)పై చెమటోడ్చి నెగ్గాడు.  తర్వాత జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోదిన్‌ ఇసారా–సావిత్రి అమిత్రాపాయ్‌ (అవధ్‌) జోడి 12–10, 11–5తో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–గుత్తాజ్వాల (ఢిల్లీ) జంటపై నెగ్గింది. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్‌ పోరు ఢిల్లీకి ట్రంప్‌ మ్యాచ్‌ కాగా ఇందులోనూ పరాజయాన్నే చవిచూడటంతో మైనస్‌ 1 తో చిత్తయింది. వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (అవధ్‌) 11–8, 11–6తో సొన్‌ వాన్‌ హో (ఢిల్లీ)పై గెలిచి వారియర్స్‌కు పరిపూర్ణ విజయాన్ని అందించాడు.
 

మరిన్ని వార్తలు