రజతం నెగ్గిన సంధ్య

30 Nov, 2017 00:29 IST|Sakshi

విజయవాడ, స్పోర్ట్స్‌: ఆసియా అమెచ్యూర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి గోలి సంధ్య రజత పతకం గెలిచింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సంధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్‌ల తర్వాత 7.5 పాయింట్లతో క్యూజోన్‌ లోరెషిల్‌ (ఫిలిప్పీన్స్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. సంధ్య ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయింది. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా లోరెషిల్‌కు స్వర్ణం, సంధ్యకు రజతం ఖాయమయ్యాయి. భారత్‌కే చెందిన అపరాజిత గోచికర్‌ ఏడు పాయింట్లతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తాజా ప్రదర్శనతో సంధ్య వచ్చే ఏడాది ఇటలీలో జరిగే ప్రపంచ అమెచ్యూర్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. గతేడాది ఇరాన్‌లో జరిగిన ఆసియా అమెచ్యూర్‌ చాంపియన్‌షిప్‌లో సంధ్య కాంస్య పతకం గెలిచింది.   

మరిన్ని వార్తలు