ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షోయబ్‌ అక్తర్‌

18 May, 2020 18:08 IST|Sakshi

లాహోర్‌: ప్రేక్షకులు లేని క్రికెట్‌ స్టేడియంలో ఆట.. పెళ్లి కూమార్తె లేని వివాహంలా నిరాసక్తంగా ఉంటుందన్నాడు పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. అయితే వైరస్‌ అదుపులోకి వచ్చాక ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆటలు ఆడించే దిశగా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హలో యాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్‌ దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు లేని స్టేడియంలో క్రికెట్‌ ఆడించేందుకు బోర్డులు ఆమోదం తెలపవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మార్కెట్‌ చేసుకోలేం. ప్రేక్షకులు లేని స్టేడియంలో క్రికెట్‌.. పెళ్లి కుమార్తె లేని వివాహం రెండు ఒకేలా నిరాసక్తంగా ఉంటాయి. ఆడే సమయంలో జన సందోహం ఉంటే వచ్చే మజానే వేరు’ అన్నాడు అక్తర్‌.('సచిన్‌ అంటే ఏంటో నాకు అప్పుడు తెలిసింది')

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించే అంశంపై గతంలో భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని‌ కోహ్లి చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్‌లో మజా, మ్యాజిక్‌ ఉండవని అన్నాడు. గప్‌చుప్‌గా నిర్వహించే ప్రత్యామ్నాయంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్, జేసన్‌ రాయ్, బట్లర్, కమిన్స్‌ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతుండగా... ఆస్ట్రేలియా విఖ్యాత ఆటగాడు అలెన్‌ బోర్డర్‌ ప్రేక్షకుల్లేని టి20 ప్రపంచకప్‌ను వ్యతిరేకించారు. మ్యాక్స్‌వెల్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (సడలిస్తే... ప్రాక్టీస్‌ను మార్చుతాం: బీసీసీఐ )

మరిన్ని వార్తలు