అందుకే టీ10 లీగ్‌ నుంచి తప్పుకొంటున్నా : షోయబ్‌

13 Nov, 2018 16:57 IST|Sakshi

ఈ నెల(నవంబరు) 23 నుంచి ఆరంభం కానున్న టీ10 లీగ్‌ సెకండ్‌ సీజన్‌ నుంచి తప్పుకొం‍టున్నట్లు పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ తెలిపాడు. తన భార్యా, కొడుకుతో కలిసి సమయం గడపాలనుకుంటున్నానని, ఈ కారణంగానే లీగ్‌ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొన్నాడు. ‘టీ10 లీగ్‌లో భాగం కాలేకపోతున్నాను. నా కుటుంబంతో కలిసి సమయం గడపాలని అనుకుంటున్నాను. ఇది కచ్చితంగా కఠినమైన నిర్ణయమే. సానియా కూడా నేను ఆడాలని కోరుకుంటోంది. కానీ నా భార్యా, కొడుకు కోసం కూడా సమయం కేటాయించాలిగా. వాళ్లిద్దరి కంటే విలువైంది ఇంకేమీ లేదు. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’  అంటూ షోయబ్‌ మాలిక్‌ ట్వీట్‌ చేశాడు. కాగా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్‌ 12న హైదరాబాద్‌లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. గత నెల (అక్టోబరు) 30న ఈ క్రీడా దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు.

ఇక యూఏఈలోని షార్జా క్రికెట్‌ స్టేడియం వేదికగా జరగనున్న టీ10 లీగ్‌ సెకండ్‌ సీజన్‌ నవంబరు 23న ప్రారంభమై డిసెంబరు 2న ముగియనుంది. 2017 టీ10 లీగ్‌లో భాగంగా పంజాబీ లెజెండ్స్‌ టీమ్‌కు షోయబ్‌ ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం ఎనిమిది జట్లు తలపడే ఈ లీగ్‌ ఫస్ట్‌ సీజన్‌లో కేరళ కింగ్స్‌ టీమ్‌గా విన్నర్‌గా నిలవగా, పంజాబీ లెజెండ్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు