ముంబై : నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పుడే వారి ప్రతిభ తెలుస్తుందని టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత లిమిటెడ్ ఫార్మాట్ జట్టులో ఈ 24 ఏళ్ల ఆటగాడు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సిరీస్లో సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఇక జట్టులోకి తీసుకోవడం.. పంపించడంతో ఒరిగేదేం లేదన్నాడు. ఇది సరైన పద్దతి కూడా కాదని చెప్పుకొచ్చాడు. టాలెంట్ ఉంటే సరిపోదని, దానికి తగ్గ అవకాశాలు కూడా రావాలన్నాడు. అప్పుడే పరిస్థితులను ఆకలింపుచేసుకోని ఆడగలే సామర్థ్యం వస్తుందని చెప్పుకొచ్చాడు. జట్టులోకి వస్తూ వెళ్తుంటే.. ఆటగాళ్లు నమ్మకం కోల్పోతారని, ప్రతిభ గల ఆటగాళ్లకు కొంత సమయం ఇవ్వాలన్నాడు.
డొమెస్టిక్ క్రికెట్లో తన ప్రదర్శనపై స్పందిస్తూ.. జట్టులో చోట్టు దక్కకపోవడంతో ఓపిక నశిస్తుందని, కానీ జట్టు ఎంపిక మన చేతిలో లేనప్పుడు అలా బాధపడితే వచ్చే ప్రయోజం ఏమి లేదన్నాడు. ఎప్పుడు ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలని, తాను అలానే చేసానని చెప్పుకొచ్చాడు. అద్భుత ప్రదర్శనతో స్థిరంగా రాణించి గుర్తింపు తెచ్చుకుంటే వెనక్కు తిరిగి చూడాల్సిన పని ఉండదన్నాడు. ఇక ప్రపంచకప్ సమయంలో తనకు చోటు దక్కుతుందని అందరూ భావించారని, కానీ దురదృష్టవశాత్తు అవకాశం దక్కలేదన్నాడు. కానీ భవిష్యత్తులో తప్పకుండా అవకాశం వస్తుందని, ప్రపంచకప్ టోర్నీ ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. నిరంతర సాధననే అలవోక పరుగులు చేయడానికి దోహదపడిందన్నాడు. భారత్ ఏ పర్యటన తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఉపయోగపడిందన్నాడు. విండీస్ పర్యటనలో కూడా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.