తెలంగాణ ‘పసిడి’ పంట

15 Jan, 2020 03:19 IST|Sakshi

 ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఒకేరోజు నాలుగు స్వర్ణ పతకాలు

గువాహటి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. అండర్‌–21 బాలుర టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) సింగిల్స్‌ విభాగంలో సూరావజ్జుల స్నేహిత్‌ చాంపియన్‌గా అవతరించగా... అండర్‌–21 బాలుర సైక్లింగ్‌ టైమ్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో తని‹Ù్క గౌడ్‌... అథ్లెటిక్స్‌లో అండర్‌–17 బాలికల 200 మీటర్లలో జీవంజి దీప్తి... అండర్‌–17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో అగసార నందిని పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. టీటీ ఫైనల్స్‌లో స్నేహిత్‌ 9–11, 12–10, 12–10, 5–11, 11–8, 11–6తో రీగన్‌ అల్బుక్యూర్‌క్యూ (మహారాష్ట్ర)ను ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. సైక్లింగ్‌ ఒక కిలోమీటర్‌ టైమ్‌ ట్రయల్‌ ఈవెంట్‌లో తనిష్క్‌ ఒక నిమిషం 08.352 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు.

కెంగలగుట్టి వెంకప్ప (కర్ణాటక) రజతం, గుర్‌ప్రీత్‌ సింగ్‌ (పంజాబ్‌) కాంస్యం గెలిచారు. ఇంతకుముందు లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో 14.07 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. ప్రాంజలి పాటిల్‌ (మహారాష్ట్ర–14.57 సెకన్లు) రజతం, ప్రియా గుప్తా (మహారాష్ట్ర–14.57 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ప్రాంజలి, ప్రియా ఒకే సమయంలో రేసు ముగించగా... ఫొటో ఫినిష్‌ ద్వారా రజత, కాంస్య పతకాలను నిర్ణయించారు. ఈ క్రీడల్లోనే 100 మీటర్లలో పసిడి సొంతం చేసుకున్న దీప్తి మంగళవారం 200 మీటర్లలోనూ చిరుతలా దూసుకుపోయింది. 24.84 సెకన్లలో రేసును పూర్తి చేసి దీప్తి చాంపియన్‌గా నిలిచింది. పాయల్‌ (ఢిల్లీ–24.87 సెకన్లు) రజతం, సుదేష్ణ (మహారాష్ట్ర–25.24 సెకన్లు) కాంస్యం సాధించారు. తెలంగాణ 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో 11వ స్థానంలో ఉంది.

యశ్వంత్‌కు స్వర్ణం...
ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పసిడి బోణీ చేసింది. అండర్‌–21 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో లావేటి యశ్వంత్‌ కుమార్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. యశ్వంత్‌ 14.10 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. అండర్‌–21 బాలికల హైజంప్‌లో జీజీ జార్జి స్టీఫెన్‌ (ఆంధ్రప్రదేశ్‌–1.60 మీటర్లు) కాంస్యం... అండర్‌–21 బాలుర ట్రిపుల్‌ జంప్‌ గెయిలీ వెనిస్టర్‌ (ఆంధ్రప్రదేశ్‌–15.51 మీటర్లు) కాంస్యం సాధిం చారు. ఆంధ్రప్రదేశ్‌ ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 24వ స్థానంలో ఉంది.   

మరిన్ని వార్తలు